HomeNational Newsహైదరాబాద్‌లో ఇంధన సెగ.. అసలేం జరుగుతోంది?

Petrol Demand in India:హైదరాబాద్‌లో ఇంధన సెగ.. అసలేం జరుగుతోంది?

Jayaram Nallabariki

March 25, 2026 / 12:20 PM

FacebookInstagramYouTubeTwittergoogle newswhatsapp
Petrol Demand in India:హైదరాబాద్‌లో ఇంధన సెగ.. అసలేం జరుగుతోంది?

ఎల్పీజీ సంక్షోభంపై పార్లమెంట్‌లో ప్రతిపక్షాల ఆందోళన

March 25, 2026 / 02:02 PM IST

పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ ప్రభావం నేపథ్యంలో దేశంలో ఎల్పీజీ (LPG) సరఫరాపై అనిశ్చితి నెలకొన్నదన్న ఆందోళనలతో ప్రతిపక్ష పార్టీలు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించాయి. బుధవారం పార్లమెంట్ ప్రాంగణంలో జరిగిన నిరసనలో మల్లికార్జున్ ఖర్గే, సుప్రియా సూలేసహా పలువురు ప్రతిపక్ష ఎంపీలు పాల్గొన్నారు. ‘సిలిండర్లు ఖాళీ.. వాగ్దానాలు ఖాళీ’ అనే నినాదాలతో బ్యానర్లు ప్రదర్శిస్తూ ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టారు. ఈ సందర్భంగా సౌగత రాయ్ మాట్లాడుతూ.. ఎల్పీజీ కొరత వల్ల సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. గృహ అవసరాలకు ముఖ్యమైన వంటగ్యాస్ అందుబాటులో లేకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు ప్రభావం కనిపిస్తోందని పేర్కొన్నారు. సమస్యను తక్షణమే పరిష్కరించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో ప్రమోద్ తివారీ మాట్లాడుతూ.. దేశంలో సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని ఆరోపించారు. అనేక ప్రాంతాల్లో గ్యాస్ సిలిండర్ల కొరత స్పష్టంగా కనిపిస్తోందని తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఎల్పీజీ సరఫరా సమస్యపై ప్రతిపక్షాల నిరసన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం ఈ అంశంపై త్వరగా స్పందించి పరిస్థితిని చక్కదిద్దాలని ప్రజలు ఆశిస్తున్నారు.

Latest Update

ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు

March 25, 2026 / 01:40 PM IST

హైదరాబాద్‌లో ఇంధన స్టేషన్ల వద్ద భారీ రద్దీ నెలకొనడంతో పోలీసులు ట్రాఫిక్ నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. లంగర్ హౌజ్ ప్రాంతంలో బుధవారం ట్రాఫిక్, శాంతిభద్రతల సిబ్బందిని ఉమ్మడిగా మోహరించారు. వాహనాల క్యూలను క్రమబద్ధీకరించేందుకు పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఓల్డ్ ముంబై హైవే, లక్డీకాపూల్ ప్రాంతాల్లో క్యారేజ్‌వేలు వరకూ క్యూలు పెరగడంతో ఇవి కీలక ప్రెజర్ పాయింట్లుగా మారాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

హైదరాబాద్‌లో పెట్రోల్ సెగ.. బంకుల వద్ద బారులు తీరిన వాహనదారులు

March 25, 2026 / 01:31 PM IST

హైదరాబాద్ నగరంలోని పెట్రోల్ బంకుల వద్ద బుధవారం భారీగా రద్దీ నెలకొంది. పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా చమురు సరఫరా నిలిచిపోతుందనే వార్తలు సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపించడమే దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది. ఈ వదంతుల నేపథ్యంలో, పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడుతుందనే ఆందోళనతో వాహనదారులు బంకుల వైపు పరుగులు తీశారు. కూకట్‌పల్లి, ప్రగతినగర్, ఎర్రగడ్డ, సనత్‌నగర్, అమీర్‌పేట, ఖైరతాబాద్, సికింద్రాబాద్, బేగంపేట, అబిడ్స్, ఎల్బీనగర్, వనస్థలిపురం, లక్డీకాపూల్ ఈ ప్రాంతాల్లోని బంకుల వద్ద వాహనాలు కిలోమీటర్ల మేర క్యూలో నిలబడటంతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి. చాలా చోట్ల 'నో స్టాక్' (No Stock) బోర్డులు దర్శనమివ్వడం ప్రజల్లో మరింత ఆందోళన కలిగించింది. గంటల తరబడి వేచి చూసినా ఇంధనం దొరక్కపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అధికారుల విజ్ఞప్తి.. పరిస్థితిని గమనించిన పౌర సరఫరాల శాఖ, చమురు సంస్థల అధికారులు స్పందిస్తూ.. నగరంలో ఇంధన నిల్వలు పుష్కలంగా ఉన్నాయని స్పష్టం చేశారు. కేవలం పుకార్లను నమ్మి ప్రజలు ఒకేసారి బంకులకు రావడంతోనే ఈ కృత్రిమ రద్దీ ఏర్పడిందని వారు తెలిపారు. "పెట్రోల్ కొరత లేదు, వదంతులను నమ్మవద్దు" అని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.

గ్యాస్ బుకింగ్‌కు 35 రోజుల వార్తలు.. కేంద్రం సర్కార్ క్లారిటీ

March 25, 2026 / 01:07 PM IST

వంటగ్యాస్ సిలిండర్ రీఫిల్ బుకింగ్ గడువును 35 రోజులకు పెంచినట్లు వస్తోన్న వార్తలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. ఎల్పీజీ (LPG) బుకింగ్ వ్యవస్థలో ఎలాంటి మార్పులు చేయలేదని స్పష్టం చేసింది. పాత నిబంధనలు యథావిధిగా కొనసాగుతున్నాయని కేంద్ర పెట్రోలియం శాఖ బుధవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. మీడియాలో మరియు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న “బుకింగ్ గడువు పెంపు” వార్తలు పూర్తిగా నిరాధారమని కేంద్రం పేర్కొంది. వినియోగదారులు భయాందోళనలకు గురికావద్దని సూచించింది. ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనల ప్రకారం పట్టణ ప్రాంతాల్లో గ్యాస్ సిలిండర్ రీఫిల్ బుకింగ్‌కు 25 రోజుల గడువు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల గడువు అలాగే కొనసాగుతుందని తెలిపింది. అలాగే డబుల్ సిలిండర్ ఉన్న వినియోగదారులకు బుకింగ్ మధ్య అంతరాన్ని 35 రోజులకు పెంచినట్లు వస్తోన్న వార్తలూ తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని స్పష్టం చేసింది. సింగిల్ సిలిండర్ వినియోగదారులకు 25 రోజులు, ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (PMUY) లబ్ధిదారులకు 45 రోజులు అనే పాత నిబంధనలే అమల్లో ఉన్నాయని తెలిపింది. అవసరం లేకుండా గ్యాస్ బుకింగ్‌లు చేయవద్దని కూడా కేంద్రం ప్రజలను కోరింది. తప్పుడు ప్రచారాలను నమ్మకుండా అధికారిక సమాచారం ఆధారంగా మాత్రమే నిర్ణయాలు తీసుకోవాలని సూచించింది. మొత్తంగా, గ్యాస్ సరఫరాలో ఎలాంటి మార్పులు లేవని, వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్రం స్పష్టతనిచ్చింది.

పెట్రోల్ కొరత ఉందా లేదా..?

March 25, 2026 / 12:59 PM IST

పెట్రోల్ కొరత ఉందా లేదా అన్నది స్పష్టంగా చెప్పాలంటే దేశవ్యాప్తంగా పెద్ద స్థాయిలో కొరత లేదు. కానీ కొన్ని నగరాల్లో తాత్కాలిక సమస్యలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్‌లో కనిపిస్తున్న పరిస్థితి ప్రధానంగా “పానిక్ బయ్యింగ్” కారణంగా ఏర్పడింది. సోషల్ మీడియాలో యుద్ధం, సరఫరా అంతరాయం వంటి వార్తలు వైరల్ కావడంతో వాహనదారులు ఒక్కసారిగా బంకులకు పరుగులు తీశారు. అందరూ ఒకేసారి ఇంధనం నింపించుకోవడంతో డిమాండ్ అకస్మాత్తుగా పెరిగింది. దీంతో కొంతమంది బంకుల్లో స్టాక్ తాత్కాలికంగా ఖాళీ అయింది. ఇక 30–40% బంకులు మూతబడటానికి మరో ముఖ్య కారణం ఆర్థిక సమస్యలు. ఆయిల్ కంపెనీలు క్రెడిట్‌పై ఇంధనం ఇవ్వకపోవడం వల్ల చిన్న బంకు యజమానులు ముందుగానే చెల్లించాల్సి వస్తోంది. కొందరు అడ్వాన్స్ ఇచ్చినా సరఫరా ఆలస్యం అవుతోందని చెబుతున్నారు. దీంతో వారు తాత్కాలికంగా బంకులు మూసివేస్తున్నారు. ప్రభుత్వం చెప్పినట్టే మొత్తం కొరత లేకపోయినా, పంపిణీ సమస్యలు + పానిక్ బయ్యింగ్ కలిసి క్యూలైన్లకు కారణమయ్యాయి. పరిస్థితి సాధారణంగా మారాలంటే ప్రజలు భయపడకుండా అవసరమైనంత మాత్రమే ఇంధనం తీసుకోవడం కీలకం.

మణికొండ పెట్రోల్ పంపుకు నో-స్టాక్ బోర్డు

March 25, 2026 / 12:55 PM IST

పెట్రోల్ కొరత నేపథ్యంలో.. హైదరాబాద్ నగరంలో వాహనాల రద్దీ నెలకొంది. మహానగరంలో పలు పెట్రోల్ బంకులు మూత పడ్డాయి. మణికొండ పెట్రోల్ పంపు వద్ద నో స్టాక్ బోర్డు దర్శనం ఇచ్చింది.

పెట్రోల్ కొరత లేదంటే… రూ.50కే పరిమితం ఎందుకు వాహదారుల ఆగ్రహం

March 25, 2026 / 12:49 PM IST

పెట్రోల్ కొరత లేదని చెబుతున్నప్పటికీ, బంక్ సిబ్బంది వాహనదారులకు కేవలం ₹50 విలువైన పెట్రోల్ మాత్రమే ఇస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఆదిలాబాద్‌ జిల్లాలో అయితే గంటల తరబడి క్యూలో నిలబడిన తర్వాత కూడా రూ.50 కంటే ఎక్కువ పెట్రోల్ పోయడం లేదని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బంక్ సిబ్బంది, వాహనదారుల మధ్య వాగ్వాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఒకవైపు ప్రభుత్వం పెట్రోల్ కొరత లేదు అని చెబుతుంది.

ఇంధన కొరతతో ట్రక్కర్ల ఫోర్స్ మేజర్ పిటిషన్

March 25, 2026 / 12:45 PM IST

ఇంధన కొరత, సరఫరా గొలుసులో ఏర్పడిన అంతరాయాలు, ఓడరేవుల నుంచి సరుకు రవాణాలో తగ్గుదల కారణంగా ట్రక్కింగ్ రంగం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితుల్లో తమ కార్యకలాపాలు సక్రమంగా నిర్వహించడం కష్టమవుతోందని ట్రక్కర్లు పేర్కొన్నారు. ఇప్పటికే కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం రవాణా చేయడం ఆర్థికంగా సాధ్యం కాదని వారు అంటున్నారు. అందుకే ఒప్పంద రవాణా ఛార్జీలను తాత్కాలికంగా నిలిపివేసి, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా స్పాట్ ధరలను అమలు చేయాలని కోరుతూ ఫోర్స్ మేజర్ పిటిషన్ దాఖలు చేశారు. పరిస్థితులు సాధారణ స్థితికి చేరేవరకు ఈ మార్పులు అవసరమని ట్రక్కర్లు అభిప్రాయపడుతున్నారు.

పెట్రోల్, డీజిల్ కొరత లేదు

March 25, 2026 / 12:35 PM IST

అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ కొరత వస్తుందన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో హైదరాబాద్ నగరంలో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. దీంతో పానిక్ బయ్యింగ్ ఒక్కసారిగా పెరిగి, పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూలు కనిపిస్తున్నాయి. అనవసర భయంతో వాహనదారులు ఎక్కువగా ఇంధనం నిల్వ చేసుకోవడానికి పరుగులు తీస్తున్నారు. అయితే ఈ పరిస్థితిపై ప్రభుత్వం, ఆయిల్ కంపెనీలు ఇప్పటికే స్పష్టత ఇచ్చాయి. రాష్ట్రంలో ఎక్కడా పెట్రోల్, డీజిల్ కొరత లేదని అధికారులు తెలిపారు. ముఖ్యంగా సివిల్ సప్లై కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, వదంతులను నమ్మకుండా సహజంగా అవసరమైనంత మాత్రమే ఇంధనం కొనుగోలు చేయాలని సూచించారు. సరఫరా వ్యవస్థ సక్రమంగా కొనసాగుతోందని, నిల్వలు తగినంతగా ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. కాబట్టి ప్రజలు అపోహలకు లోనవకుండా ప్రశాంతంగా ఉండాలని సూచిస్తున్నారు.

ప్రభుత్వం కీలక ప్రకటన

March 25, 2026 / 12:30 PM IST

తెలంగాణలో పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ కొరతపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో ఎక్కడా పెట్రోల్, డీజిల్ లేదా వంట గ్యాస్ (LPG) కొరత ఏమాత్రం లేదని రేవంత్ సర్కార్ స్పష్టం చేస్తోంది. ఆయిల్ రిఫైనరీల నుంచి స్థానిక డిపోల వరకు ఇంధన సరఫరా యంత్రాంగం పూర్తిగా, సక్రమంగా పనిచేస్తోంది. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని ప్రజల రోజువారీ అవసరాలను తీర్చడానికి సరిపడా ఇంధన నిల్వలు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేసింది.

కేంద్రప్రభుత్వంపై ఎం. కె. స్టాలిన్ విమర్శలు

March 25, 2026 / 12:26 PM IST

ఎం. కె. స్టాలిన్ కేంద్ర ప్రభుత్వాన్ని వంటగ్యాస్ కొరత విషయంలో తీవ్రంగా విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ చేసిన “కోవిడ్ కాలంలా ఉంది” అనే వ్యాఖ్య ప్రజల్లో అనవసర భయాందోళనలను రేకెత్తించిందని ఆయన అన్నారు. ఇప్పటికే ఎల్పీజీ సిలిండర్ల కొరతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఈ వ్యాఖ్యలు మరింత ఆందోళన కలిగించాయని స్టాలిన్ పేర్కొన్నారు. గ్యాస్ సరఫరాలో అంతరాయం వల్ల అనేక రెస్టారెంట్లు మూతపడటం, కార్మికులు ఉద్యోగాలు కోల్పోవడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయని ఆయన తెలిపారు. ఈ సంక్షోభం ప్రజల దైనందిన జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతోందని, కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుని సరఫరాను స్థిరపరచాలని డిమాండ్ చేశారు.

వాస్తవం ఏంటి?

March 25, 2026 / 12:20 PM IST

ప్రభుత్వం, ఆయిల్ కంపెనీల అధికారులు ఈ పరిస్థితిపై స్పష్టతనిచ్చారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ నిల్వలకు ఎలాంటి కొరత లేదని, ఆయిల్ డిపోల వద్ద సరిపడా స్టాక్ ఉందని అధికారులు ప్రకటించారు. సరఫరా గొలుసులో ఎలాంటి అంతరాయం లేదని, కేవలం సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తల వల్లే ఈ గందరగోళం ఏర్పడిందని వారు స్పష్టం చేశారు. అవసరానికి మించి ఇంధనాన్ని నిల్వ చేసుకోవడం వల్ల కృత్రిమ కొరత ఏర్పడే ప్రమాదం ఉందని, ప్రజలు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ప్రస్తుత పరిస్థితులు

March 25, 2026 / 12:17 PM IST

భారీ క్యూలైన్లు: కేవలం వాహనాలే కాకుండా, ప్రజలు ప్లాస్టిక్ డబ్బాలు, సీసాలు, బకెట్లతో ఇంధనం కోసం గంటల తరబడి వేచి చూస్తున్నారు. అర్ధరాత్రి వేళ కూడా బంకుల వద్ద రద్దీ తగ్గకపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఘర్షణలు: రద్దీ పెరగడంతో వాహనదారుల మధ్య వాగ్వాదాలు చోటుచేసుకుంటున్నాయి. పరిస్థితిని అదుపు చేయడానికి కొన్ని చోట్ల యాజమాన్యాలు పోలీసుల రక్షణను కూడా కోరుతున్నాయి. నో స్టాక్ బోర్డులు: విపరీతమైన డిమాండ్ కారణంగా కొన్ని బంకుల్లో స్టాక్ త్వరగా అయిపోవడంతో 'నో స్టాక్' బోర్డులు వెలుస్తున్నాయి. ఇది ప్రజల్లో మరింత భయాన్ని పెంచుతోంది.

No Previous Article

No Previous Article

Next Article
No Next Article

No Next Article

FOLLOW US
FacebookInstagramYouTubeTwittergoogle newswhatsapp
Loading...